ఒలింపిక్స్ లో పివి సింధు ప్రదర్శించిన ఆట, కాంస్యం సాధించిన తీరు అద్బుతమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. కాంస్య పతకం సాధించటం పట్ల ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలోని షటిల్ ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిధిగా హాజరై కేకే కట్ చేసి మీడియా ద్వారా PV సింధు కి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇండోర్ స్టేడియంనకు ఉన్న సింధు వాల్ పెయింటింగ్ కు పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి స్వీట్ తినిపించారు.
భవిష్యత్తు ఒలింపిక్స్ లో ఆడాలనుకునే మహిళలకు ఆమె గొప్ప స్ఫూర్తిదాయకం అన్నారు. అవకాశాలు కల్పిస్తే ఆకాశమే హద్దు అని చాటి చెప్పిన గొప్ప మహిళా ఒలింపియన్ పి.వి సింధు అని పేర్కొన్నారు. వరుసగా రెండు ఒలింపిక్ క్రీడలలో పతకం సాధించిన ఏకైక భారతీయురాలుగా పి.వి సింధు ఒక చరిత్ర సృష్టించారన్నారు. ఆమె ఇలాంటి మరెన్నో విజయాలు నమోదు చేసి దేశ ప్రతిష్టను, తెలుగు గౌరవాన్ని, మహిళల ఆత్మ విశ్వాసాన్ని పెంచాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నందు అన్ని క్రీడా వసతులు కల్పించమన్నారు. ప్రతి క్రీడాకారులకు ప్రత్యేక వసతులతో కూడిన శిక్షణను ఇక్కడ ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ,జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ విజయ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, జిల్లా క్రీడాధికారి పరందామ రెడ్డి,వివిధ క్రీడల కోచ్ లు, క్రీడాకారులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.