వడ్డీ వ్యాపారం ముసుగులో దౌర్జన్యం చేస్తే ఉపేక్షించేది లేదని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారంపై నిఘాను పటిష్టం చేస్తున్నామని, బాధితులకు చట్టపరమైన సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు.
ఎదుటి వారి ఆర్ధిక అవసరాలు …కష్టాలను ఆసరగా చేసుకొని కొంతమంది వడ్డీ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అప్పులిస్తూ..సకాలంలో … చెల్లింపులు చేయలేని వారిని మానసికంగా వేధిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
అధిక వడ్డీలు కట్టలేక మానసికంగా ఆర్ధిక ఒత్తిడి తట్టుకోలేక అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, అలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో వడ్డీ వ్యాపారుల్లో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు, బంగారు ఆభరణాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వాహనాలు కుదువ పెట్టుకొని ఇచ్చే దళారులే అత్యధికంగా ఉన్నారని వారిపై దృష్టి సారించామని తెలిపారు.