కర్ణాటక రాష్ట్రం బీదర్ లో కొనుగోలు చేసి అక్కడ నుండి అక్రమంగా రవాణా చేస్తున్న అక్రమ గుట్కాను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం,కామేపల్లి ఖమ్మం గ్రామీణ మండల గ్రామాల్లో విక్రయించడానికి గుట్కాను తీసుకువస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో రంగంలో దిగారు.
టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామానుజం ఆధ్వర్యంలో సిఐ రవికుమార్ రఘునాథపాలెం పోలీసులు ఈరోజు స్థానిక పోలీసులతో కలసి రఘునాథపాలెం గ్రామ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన టిఎస్ 04 EY2841 కారును తనిఖీ చేయగా నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తులు 13 సంచులు గుర్తించారు.
వీటి విలువ సుమారు రూ. 5,02,800 / – వుంటుందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. గుట్కాతో పాటు నిందితులు ఆడపా రవికుమార్ ను కూడా పట్టుకున్నారు. మరో నిందితుడైన తల్లంపాడుకు చెందిన పుచ్చకాయాల సురేష్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
తనిఖీల్లో టాస్క్ఫోర్స్ రవికుమార్, ఎస్ఐ ప్రసాద్, పిసిలు హమీద్, చెన్నారావు, సూర్యనారాయణ, కళింగారెడ్డి, రామారావు పాల్గొన్నారు.