అన్ని లైసెన్సులు ఉంటే మంచి నీళ్ల వ్యాపారం చేసుకోవచ్చు. తప్పులేదు. అయితే నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలిగొనే అధికారం మాత్రం ఎవరికీ ఉండదు. అయితే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మాత్రం నీటి వ్యాపారం ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది.
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేసీఆర్ నగర్ లో కొన్ని రోజులుగా మల్లీశ్వరి సుమన్ జీవధార పేరుతో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. ఈ వాటర్ ప్లాంట్లో వచ్చే వ్యర్థపు నీటి నిల్వ కోసం ఒక పెద్ద సంపును ఏర్పాటు చేశారు. ఈ సంపు నకు ఎలాంటి రక్షణ గోణ లేదు.
అదే కాలనీలో నివాసం ఉంటున్న నర్సింగ్, అశ్విని దంపతుల పెద్ద కుమారుడు రాజ్ కుమార్ శ్రీ శ్రీ జ్ఞాన మందిర్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలకు సెలవు ఉండడంతో అక్కడ ఆడుకుంటూ ఎలాంటి రక్షణ కవచం లేని ఆ సంపులో పడి ఊపిరాడక మరణించాడు.
విషయం తెలుసుకున్న జవహర్ నగర్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని కాలనీ వాసులు ఆందోళన చేశారు.