డబ్బు కోసం కన్న కొడుకుని తండ్రే కిడ్నాప్ చేయించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని పిల్లుట్ల రోడ్ లో నివాసముంటున్న శాగలంపూడి శివ తన తమ్ముడు గాంధీ కుమారుడు సంతోష్ కుమార్ ను అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయినట్లు, నిందితులు తనకు ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పిడుగురాళ్ల పట్టణ సీఐ సురేంద్రబాబు,వారి సిబ్బంది కిడ్నాప్ జరిగిన ఐదు గంటల లోపే కేసును చేధించి బాలుడిని సురక్షితంగా రక్షించారు. అపహరణకు గురైన బాలుడిని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ చేతులమీదుగా బాలుని తల్లికి అప్పగించారు.ఈ సందర్భంగా తక్కువ వ్యవధిలో కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి రూరల్ ఎస్పీ విజయరావు అభినందనలు తెలియజేశారు. ఆ పసిబాలుడి తండ్రే ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు.