తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ బాధల తెలంగాణ చేశారని, ప్రభుత్వ విధానాలు చూస్తుంటే ఈ ప్రభుత్వం కన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే నయమని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన చర్చల అనంతరం కార్మికులతో రోషపతి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ పాలనలో తెల్ల రేషన్ కార్డు మీద నిత్యావసర సరుకులైన పంచదార, కందిపప్పు, మంచినూనె, చింతపండు 14 శాల్తీలు ఇచ్చేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సకల జనుల సర్వే చేసి ఉన్న రేషన్ సరుకుల తీసివేసి బియ్యం మాత్రమే అది కూడా మొద్దు బియ్యం ఇస్తున్నారని అన్నారు.
హుజూర్ నగర్ లోని రైస్ మిల్లు అసోసియేషన్ భవనంలో మిల్లులో పనిచేసే దినసరి కూలీలు, మిల్లర్స్ అసోసియేషన్ యాజమాన్యంతో జరిగిన జాయింట్ చర్చలో భాగంగా ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలీల రోజువారి వేతనం పెంచాలని కోరారు.
సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో యాజమాన్యం గతంలో ఇచ్చే 350 రూపాయలు రోజు కూలీ మీద అదనంగా 20 రూపాయలతో 370 రూపాయలు పెంచటానికి ముందుకు రాగా, కార్మికులు ఉన్న కూలీలపై 130 రూపాయలతో 480 రూపాయలతో రోజుకూలీ పెరగాలని కోరారు. దీంతో చర్చలు వాయిదా పడ్డాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు పోలిశెట్టి లక్ష్మీ నరసింహారావు, సింగికొండ శ్రీనివాస్, కుక్కడపు రామ మోహన్ రావు, గజ్జి ప్రభాకర్, గెల్లి అప్పారావు, CITU ప్రతినిధులు ఎలక సోమయ్య గౌడ్, సిఐటియు అనుబంధం సంఘం దిన కూలీల యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు సామల కోటమ్మ, మొదాల గోపమ్మ, సుజాత, బుజ్జి, రాధా, రమణ,మంగమ్మ, వెంకమ్మ, బేగం తదితరులు పాల్గొన్నారు.