అనునిత్యం వార్తల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడిని ఏకవచనంతో అత్యంత దారుణంగా విమర్శించే మాజీ మంత్రి కొడాలి నాని ఏమైపోయారో అర్ధం కావడం లేదని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొడాలి నానికి మంత్రి పదవి పోయిన నాటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో మళ్లీ మంత్రుల్ని మార్చుకోవాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి జగన్ ఉన్న మంత్రుల్ని హెచ్చరించిన అనంతరం కొడాలి నాని మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తనదైన శైలిలో చంద్రబాబునాయుడిని ఆయన కుమారుడు లోకేష్ ను దారుణంగా విమర్శించడం ప్రారంభించారు.
ఈ దశలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మారుస్తూ ముఖ్యమంత్రి జగన్ రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఒక్క సారిగా రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎన్టీఆర్ అంటే తనకు ప్రాణం అని కొడాలి నాని తరచూ చెబుతుంటారు. ఎన్టీఆర్ దయవల్లే తామంతా రాజకీయాల్లోకి వచ్చామని కూడా ఆయన ఎంతో గర్వంగా చెబుతుంటారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసినప్పుడు కూడా కొడాలి నాని రియాక్ట్ అయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని వ్యాఖ్యానించారు కూడా. అయితే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును ఒక్క సారిగా తీసేసినా కొడాలి నాని మాట్లాడలేదు. ఎన్టీఆర్ పేరు తీసేయడం అన్యాయం అనో, ఎన్టీఆర్ పేరు తీసేసినా ఫర్లేదు అనో ఏదో ఒకటి చెప్పాల్సిన కొడాలి నాని అందుకు దూరంగా ఉన్నారు.
చంద్రబాబునాయుడిని వ్యక్తిగతంగా దూషిస్తూ వ్యక్తిత్వ హననానికి తరచూ పాల్పడడంతో కమ్మ కులం వారి నుంచే ఇటీవలి కాలంలో తీవ్ర ప్రతిఘటన వచ్చింది. ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్టు చేస్తే కొడాలి నానిని ఆయన సొంత కులం అయిన కమ్మ వారే తీవ్రంగా విమర్శించే అవకాశం ఉంది. సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే త్వరలో రాబోయే మంత్రి పదవి దూరం అవుతుందేమోనని ఆయన మదన పడుతున్నారేమో తెలియదు. ఈ దశలోనే ఆయన సైలెంట్ గా ఉన్నారని ఆయన అభిమానులు బాధపడుతున్నారు.
ఇదే సమయంలో అమరావతి రైతుల మహా పాదయాత్ర తన సొంత నియోజకవర్గం అయిన గుడివాడకు నిన్న చేరుకున్నది. సీఎం జగన్ కు అత్యంత విధేయుడైన కొడాలి నాని నియోజకవర్గంలోకి అమరావతి రైతుల మహా పాదయాత్ర ప్రవేశిస్తే ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయని అందరూ భావించారు. అయితే అలాంటివేం జరగలేదు. దాంతో ఇటు అమరావతి రైతులు, అటు తెలుగుదేశం కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
అమరావతి రైతులు ఏ రూట్ లో వస్తారో ఆ రూట్ లో వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసేవి. మూడు రాజధానులు ముద్దు అంటూ ఫ్లెక్సీలు వెలిసేవి. అయితే గుడివాడలో అలాంటివి కనిపించకపోవడం పై కూడా అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడ నియోజకవర్గానికి చేరుకోగా గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెంలో వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, రైతులతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్ష నేతలు వారికి ఘనస్వాగతం పలికారు. స్థానిక రైతులు ఎడ్లబండ్ల ర్యాలీతో అమరావతి రైతులకు మద్దతు తెలపగా.. స్థానిక మహిళలు పొలాల్లో పూలు తెచ్చి రైతులపై చల్లారు. గుడివాడ నియోజకవర్గ పల్లెలు ఆకుపచ్చ జెండాలు, జై అమరావతి నినాదాలతో మార్మోగింది.