ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభకు స్థలం కావాలని అందుకోసం రైతులు పంట వేయవద్దని మాజీ మంత్రి కొడాలి నాని రైతులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని మల్లాయి పాలెం లే అవుట్ లో డిసెంబర్ 21న సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభ దృష్ట్యా లే అవుట్ పక్కన ఉన్న 14 ఎకరాల్లో మినుము పంట వేయొద్దని రైతులకు కొడాలి నాని ఆదేశాలు జారీ చేశారు. సీఎం సభ ఉంది మినుము పంట వెయ్యొద్దని మాజీ మంత్రి కొడాలి నాని రైతులకు హుకుం జారీ చేయడం పై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి ఆదేశాలను పాటించక తప్పని పరిస్థితి ఉండటంతో తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విషయం తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రైతులను పరామర్శించారు. నష్టపరిహారం చెల్లించకుండా పంట వేయొద్దని ఎలా ఆదేశాలిస్తారని అధికారులకు ఫోన్ చేసి ఆయన ప్రశ్నించారు. అదును దాటిపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి వచ్చే 30 వేల ఆదాయం కోల్పోతామని రైతులు అంటున్నారు. అధికార పార్టీ నేతలు ఇంత నీచ స్థితికి దిగజారడమా అని మాజీ ఎమ్మెల్యే రావి ప్రశ్నిస్తున్నారు.