తెలుగుదేశం పార్టీ నిరసనలకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కొడాలి నాని మద్దతుదారులు చేపట్టిన ర్యాలీతో కృష్ణాజిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. నిన్న టీడీపీ నేతలు చేసిన ఆందోళన కార్యక్రమాలకు కౌంటర్ గా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని మద్దతుదారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడ వైసిపి కార్యాలయం నుండి భారీ ర్యాలీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వారు జై కొడాలి నాని అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
కొడాలి నాని పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ వైసిపి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి నెహ్రూ సెంటర్ కు వెళ్లేందుకు వైసీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరగా మార్కెట్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా మార్కెట్ సెంటర్ లో వైసీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. నెహ్రూ చౌక్ సెంటర్లో గల గుడివాడ టిడిపి ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు కు చెందిన వస్త్ర దుకాణ షోరూమ్ ను పోలీసులు ముందస్తుగా మూయించారు.