కడప జిల్లా ఒంటిమిట్టలో ప్రసిద్ధ శ్రీ కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా మూడవ రోజు ఉదయం వేణుగాన అలంకారం లో సీతా సమేత శ్రీ రాముడు దర్శనమిచ్చారు. శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం ఉదయం రోజువారీ సుప్రభాతం సేవ, ఆలయ శుద్ది, ఆరాధన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కరోనా కారణంగా భక్తులకు అనుమతించడం లేదు. కేవలం ఆలయ అర్చకులు మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా మూడో రోజు ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళవాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు.
వేణుగాన అలంకారం లో సీతా సమేత శ్రీ రాముడుగా దర్శనమిచ్చారు. వాహన సేవలు ఆలయం లోపలే ఉంచి ఊరేగింపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 6నుంచి 6.30 లోపు ఏకాంతగా పూజలు జరపనున్నారు.
ఏడవ తేదీ సాయంత్రం స్వామి వారి కళ్యాణం వేడుకగా నిర్వహించనున్నారు. ఈ పది రోజుల పాటు ఆలయం లోపల వాహన సేవలు, కల్యాణం భక్తులకు ప్రవేశం లేకుండా కేవలం టీటీడీ అధికారులు,అర్చకులు,మంగళ వాయిద్యాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.