శ్రీకాకుళం పట్టణం తెలగ యువజన సంక్షేమ అధ్యక్షుడు డా.గుండ బాల మోహన్ ఆధ్వర్యంలో ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం పట్టణం లోని క్రీడా ప్రాంగణంలోని కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి అని ఆయన అన్నారు. ఈ వంశ పరంపరలోని కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు.
అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతి పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు.
మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.
విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది.
1912లో మద్రాసు చేరాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. 1600 మంది గల తన బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు.
సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ తమ్ముడు ఇమామ్ బక్షీ ఆ బృందంలో వుండేవాడు. లండన్ లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిని తమ బకింగ్ హామ్ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత ‘ఇండియన్ హెర్కులస్’ బిరుదంతో సత్కరించారు.
అనితర సాధ్యమైన పనులు చేసేవారు
ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు. స్పెయిన్ దేశంలో ‘కోడె పోరాటం’ (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది.
ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు. ఆ పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తి ‘ సరే ‘ అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.
జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి. బర్మాలో వున్నపుడు రంగూన్లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు.
అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు.పూనాలో లోకమాన్య తిలక్ కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.
హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదమిచ్చారు. అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు.
త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.
అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగింది. రామమూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది. జాతీయ నాయకులెందరో చూచి ఆనందించారు.
పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు. ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు. ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు. ఇంతటి మహనీయుడిని స్మరించుకోవడం మన విద్యుక్త ధర్మమని గుండ బాల మోహన్ అన్నారు.