తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 20వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు.
ఆలయంలోని ఆనందనిలయం నుంచి బంగారువాకిలి వరకు శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితరాలను నీటితో శుభ్రంగా కడిగారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును పూర్తిగా బట్టతో కప్పారు. శుద్ధి చేసిన తరువాత, నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చకు, గడ్డ కర్పూరం, గంధపు పొడి, కుంకుమ, కిచ్చిగడ్డ మరియు ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా వ్యాపింపజేస్తారు. ఆ తర్వాత స్వామివారి మూలవిరాట్టుపై కప్పిన వస్త్రాన్ని తొలగించి శాస్త్రోక్తంగా అర్చకులు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.