ప్రజాస్వామ్యం అంటే తెలియని, పరిపక్వత లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్,ఎమ్మెల్సీ డాక్టర్ పివి సూర్యనారాయణ రాజు లు అన్నారు. విజయనగరంలోని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ముందుగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటనను శనివారం నాడే స్వాగతించామని అన్నారు. పవన్ కళ్యాణ్ తన పర్యటనకు కారణం తెలియకుండా అవినీతి జరిగిందంటూ కేకలు వేస్తూ, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి చేసిన పర్యటన ఇది అని అన్నారు. ఏదైనా అవినీతి జరిగితే, కేవలం ప్రకటనలు కాకుండా నిరూపించే దమ్ము పవన్ కళ్యాణ్ కి ఉందా అని ప్రశ్నించారు. గుంకలానికి వచ్చావు, చూసావు, వెళ్లావు తప్ప గుంకలాములో ఒక రూపాయి అయినా అవినీతిని చూపించగలవా పవన్ కళ్యాణ్ అని అన్నారు.
తన చేతకానితనంతో ప్రజలను మభ్యపెట్టేందుకు, చంద్రబాబుని సంతోషింప చేయడానికి పర్యటన చేస్తున్నాడే తప్ప, రాజకీయ పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. 2024లో పవన్ కళ్యాణ్ కి ఓటమి తప్పదని అన్నారు. అభిమానుల కేకలతో,ముఖ్యమంత్రి అయిపోయినట్టు, చంకలు గుద్దుకుంటున్నారు తప్ప 175 స్థానాలు లో పోటీ చేసే సత్తా కానీ, గెలిచే శక్తి కానీ పవన్ కళ్యాణ్ కి ఉందా అని అన్నారు.
సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ ని చూడడానికి అభిమానులు వస్తున్నారని అన్నారు. మంత్రుల అవినీతి గురించి మాట్లాడుతున్నారని, నిరూపించే సత్తా పవన్ కళ్యాణ్ కి ఉందా అని అన్నారు. గుంకలం పర్యటనలో పవన్ కళ్యాణ్ ఒక్క లబ్ధిదారుడు తో కూడా మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇండ్ల పట్టాలు సీఎం జగన్ నేతృత్వంలో ఇవ్వడం జరిగిందని అన్నారు.
గతంలో సీఎం గా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా, అర్హత ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గోల గోవిందుడు ది, ముడుపులు వెంకటేశ్వర స్వామి వి అన్నచందంగా ఎన్నికల ముందు గోల నీది, విజయం మాది అని అన్నారు. ఋషికొండకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఏమి నిరూపించారని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా, విశాఖ పరిపాలన రాజధానిగా సీఎం జగన్ విశేషమైన కృషి చేస్తూ ఉంటే, జగన్ పరిపాలనకు అడ్డంకులు పెడుతున్న మాట వాస్తవం కాదా అని అన్నారు. రానీ అధికారం కోసం, లేని భ్రమలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయవద్దని అన్నారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని అన్నారు.
పవన్ పర్యటనకు సామాన్య ప్రజలు ఎవరు రాలేదని, కేవలం అభిమానులు వచ్చారని సంగతి గ్రహించాలన్నారు . అట్టహాసంగా వచ్చామని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్, వచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. సీఎం జగన్ ని ప్రశ్నించే అర్హత చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ కేఏ పాల్ కు , పవన్ కళ్యాణ్ కు తేడా లేదని అన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాట, భాష ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, యువతను పెడత్రోవ పెట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ప్యాకేజీ ఉంటేనే పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకు వస్తాడని అన్నారు. సీఎం జగన్ వేలకోట్ల రూపాయలతో ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని, ఎక్కడ అవినీతి లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ సభ్యులు డాక్టర్ పివి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని జన సేన నాయకులు చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.
కేవలం 1500 మంది ఉంటే అది బ్రహ్మరథం అంటారా, లేక విశాఖపట్నంలో సీఎం జగన్ నేతృత్వంలో ప్రధాని రాకకు లక్షలాదిమందితో జరిగిన సభను బ్రహ్మరథం అంటారా అని ప్రశ్నించారు. ఒక్క సీటు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. పరిపక్వత లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, జోనల్ ఇన్చార్జ్ లు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.