పాఠశాలలకు వేసవి కాలం సెలవులు ఇవ్వడంతో కొందరు వారి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇదే సమయంలో ఎండాకాలంలో దొంగతనాలూ ఎక్కువగా జరుగుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, విహార యాత్రలతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్తుంటారు. ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎండాకాలంలో ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక ఆరుబయట, డాబాలపై నిద్రిస్తుంటారు. ఇదే సమయాల్లో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తారు.
ఇలాంటివి జరగకుండా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ యాలాద్రి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ప్రజలకు సిఐ పలు సూచనలు చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఉండే వారు, తరచూ ప్రయాణాలు చేసేవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడ కుండా సర్కిల్ పరిధిలో ముఖ్యంగా కొల్లాపూర్ పట్టణంలో పోలీస్ లు నిఘా ఉంచే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వేసవి సెలవుల్లో ఊరెళ్లేవారూ జాగ్రత్తలూ పాటించాల్సిందేనని సీఐ యాలాద్రి సూచిస్తున్నారు.
ఊరు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటికి పటిష్టమైన తాళాలు వేసుకోవాలని తెలిపారు. ఊరెళ్ళేవారు పోలీసులకు ముందస్తు సమాచారం కచ్చితంగా ఇవ్వాలని అంటున్నారు. పోలీస్ ల సూచనలు పాటిస్తే దొంగతనాలకు ఆస్కారం తక్కువగా ఉంటుందంటున్నారు.
అర్థరాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు పదే పదే తలుపులు బాదినా, పగలగొట్టి లోనికి చొరబడినా అత్యవసర సర్వీసులు వినియోగించుకోవాలనీ తెలిపారు. ఇలాంటి సమయాల్లో దొంగలను ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా 100, 101, 108 తో పాటు స్థానిక పోలీసు స్టేషన్ నెంబర్లకు ఫోన్ చేయాలనీ అంటున్నారు.
ఇంటి ఆవరణలో కాలనీలో ఎవ్వరైనా కొత్తవారు, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ లకు సమాచారం ఇవ్వాలనీ తెలిపారు. వారి కదలికలను తెలుసుకుంటూ ఉండాలి అంటున్నారు. అదేవిధంగా ఊరు వెళ్ళే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే పోలీస్ లు రెక్కీ నిర్వహిస్తారు. ఆ ఏరియాలో పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచుతారంటున్నారు. ప్రత్యేకంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని పేర్కొంటున్నారు.
సిసి కెమెరాల పై సీఐ సూచనలు
ప్రజలు ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ యాలాద్రి సూచనలు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ సరిగా రికార్డు అవుతున్నాయో లేదో అప్పుడప్పుడూ సరి చూసుకోవాలని అంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్