కందుల కొనుగోలును ప్రభుత్వం నిలిపివేయడంతో కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ లో రైతులు ఆందోళన చేశారు. మార్కెట్ యార్డ్ గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. కందుల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా రైతులను ఇబ్బందుల పాలుచేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.
రైతుల ధర్నాతో బస్సులు, వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి వెంకట రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ కొంపల్లి మురళి గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. మరో వైపు మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి రైతులకు కందుల కొనుగోలుపై హామీ ఇస్తున్నారు.
సింగిల్ విండో ఎన్నికల కారణంగా కందుల కొనుగోలుకు కొంచెం అంతరాయం ఏర్పడిందని, ఇంతలో కందుల కొనుగోలు నిలిపివేయాని ప్రభుత్వం ఆదేశించిందని ఆయన అన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే తో కలిసి వెళ్లి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి విషయం వివరించామని, ఆయన కందులు కొనుగోలుకు మళ్లీ ఆదేశాలు ఇప్పించారని నరేంద్ర రెడ్డి తెలిపారు.
దళారుల మాటలు విని కంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు పరశురాం నాయుడు, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.