నెల రోజుల గడుస్తున్నా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నియోజకవర్గానికి రాలేదని టీపీసీసీ సభ్యుడు రంగినేని అభిలాష్ రావు అన్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్టోబర్ మొదటి వారం నుండి ఎమ్మెల్యే కొల్లాపూర్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడం చాలా శోచనీయమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఖూనీ చేస్తున్నాయని ఆయన అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రభుత్వాలు ప్రజలను మభ్య పెడుతు ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ డబ్బు,మద్యంతో ప్రజలను బానిసలు చేసి ఒక మహిళ మీద గెలవడం ఒక గెలుపెనా…? అని అభిలాష్ రావు మండిపడ్డారు. ఒక వైపు మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుంటే మరొక వైపు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 100 కోట్లకు బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి సిద్దం కావడం ఈ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని ఆయన అన్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి మూడు నెలలు గడవకముందే అభివృద్ధి పేరు మీద టీఆర్ఎస్ పార్టీ లోకి పోయిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మళ్ళీ 100 కోట్లకు అమ్ముడు పోవడానికి సిద్దంగా ఉండి దొరికిపోయిన వారిని ఎం అనాలి అని అభిలాష్ రావు ప్రశ్నించారు. నెల రోజులు గడుస్తున్న ఇప్పటికీ వరకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ కనిపించని ఎమ్మెల్యే ని ఏమనాలి…ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తారు…? అని అడుగుతున్నాను అని రంగినేని అన్నారు.
తన అవసరాల కోసం హర్షవర్ధన్ రెడ్డి పలు పార్టీలు మారుతుంటే ప్రజలు అందరూ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తారని అభిలాష్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కంటే శివన్న, జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రెటరీ రఫీ ఉద్దీన్, కొల్లాపూర్ టౌన్ ఉపాధ్యక్షుడు బాబా, వీపనగండ్ల మండల అధ్యక్షుడు గోదల బీర్యయ్య యాదవ్, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు తగిలి కృష్ణయ్య, పెంట్లవెల్లి మండల అధ్యక్షుడు నరసింహ యాదవ్, పెంట్లవెల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.