కరోనా కాలంలో ఎంతో మంది ఉపాధి లేక అల్లాడుతున్నారు. సంపాదన లేక పస్తులుంటున్నారు. అయితే మందు బాబులు, పేకాట రాయుళ్లుకు మాత్రం డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఈ రెండు మాత్రం విచ్చలవిడిగా సాగుతున్నాయి.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట డెన్ ఉంది. వేలాది రూపాయల బెట్టింగ్ లు పెట్టి అక్కడ పేకాట ఆడుతున్నారు. ఎంత కాలంగా ఈ డెన్ అక్కడ నడుస్తున్నదో తెలియదు కానీ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కొల్లాపూర్ పోలీసులకు లభించిన పక్కా సమాచారంతో ఒక్క సారిగా దాడి చేశారు.
సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి ఆదేశాలతో కొల్లాపూర్ ఎసై కొంపల్లి మురళి గౌడ్ సిబ్బందితో పేకాట స్తావరంపై దాడి చేశారు. కొల్లాపూర్ పట్టణం నుంచి చౌటబెట్ల (15వ వార్డు) కు వెళ్లే దారిలో భారత్ గ్యాస్ గోదాం వెనకాల ఈ పేకాట డెన్ నిర్వహిస్తున్నారు. పోలీసులు దాడి చేసే సమయంలో కొంత మంది పేకాట ఆడుతున్నారు కూడా.
ఈ రైడ్ లో 13 మంది పేకాటరాయుళ్ల తో పాటు ఏడు బైకులు,12 సెల్, ఫోన్లు,62 వేల 180 రూపాయల నగదు పట్టుకున్నామని సిఐ బి.వెంకట్ రెడ్డి, ఎసై మురళి గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.