భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర గౌరెల్లి జంక్షన్ - కొత్తగూడెం జాతీయ రహదారికి నెంబరింగ్ ఇవ్వాలని ఆయన కోరారు. వలిగొండ తొర్రురు నెల్లికుదురు మహబూబాబాద్, ఇల్లందు మీదుగా హైదరాబాద్ కొత్త గూడెం మధ్య రహదారిని జాతీయ రహదారి గా గుర్తించారు. అయితే రోడ్ నిర్వహణ సరిగా లేదని మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆయన అన్నారు. ఎంతో ఉపయోగకరమైన ఈ రోడ్డును అశ్రద్ధ చేస్తున్నారని ఆయన తెలిపారు.
హైదరాబాద్, విశాఖపట్నం, ఛత్తీస్ ఘడ్ ల మధ్య దూరాన్ని 100 కిలో మీటర్లు తగ్గిస్తుందని, తన పార్లమెంట్ పరిధిలో ఈ జాతీయ రహదారి 100 కిలోమీటర్లు ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 2016 లోనే డిపిఆర్ సిద్ధం చేశారని అయితే నేటికి పనులు మొదలు కాలేదని ఆయన అన్నారు. డీపీఆర్ ఆమోదించి నిధులు విడుదల చేయాలని కోరారు.