మునుగోడు బై ఎలక్షన్ లో చివరి క్షణం వరకు రాజీ లేని పోరాటం సాగించి కొద్ది ఓట్లతో ఓడినా, నైతిక విజయం సాధించిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరాట పటిమను అభినందిస్తున్నానని బిజెపి సీనియర్ నాయకులు పేరాల శేఖర్ రావు అన్నారు. బిజెపి నాయకత్వం, పార్టీ విధానాల పట్ల అత్యంత విశ్వాసంతో పార్టీలో చేరిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఆయన అన్నారు. మునుగోడులో గెలిచింది ప్రజాస్వామ్యం కానే కాదు.
గెలిచింది ధనస్వామ్యం, అధికార దుర్వినియోగం, అధికార పార్టీకి తలవంచిన పోలీస్ వ్యవస్థ, మద్యం సిసాలు మాత్రమేనని ఆయన అన్నారు. ఓటరుకు 5వేల నుండి 10 వేల రూపాయలు పంచడం, గ్రామ మరియు మండల స్థాయి కీలక నాయకులకు లక్షలాది నోట్ల కట్టలతో ప్రలోభ పరచడం జరిగిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో పోలీస్ టాస్క్ పోర్స్ అక్రమ ఫోన్ టాపింగ్ లతో బిజెపి నాయకులను వేటాడడం, ప్రతి బూత్ లో అధికార పార్టీ మంత్రులు, MLA లు ఇతర నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం కూడా జరిగాయని ఆయన అన్నారు. వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు చేతులు మారినా, కోట్లాది రూపాయల మద్యం ఏరులై పారినా, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరినా, ఎన్నికల కమీషన్ నిస్సహయంగా చూసి చూడనట్లు వ్యవహరించడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు.
ఇటువంటి సందర్బాల్లో ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్, కేంద్ర ప్రభుత్వాలు కూడా తమ పాత్ర గురించి పూనరాలోచించాల్సిన అవసరం వుందని పేరాల సూచించారు. సీఎం తన “ గోబెల్స్ “ ప్రచారంలో కొంత వరకు విజయం సాధించారని ఆయన తెలిపారు. మంత్రులు, MLA లు నెలల తరబడి తమ ప్రాంతాలు వదిలి, తమ బాధ్యతలు ప్రక్కన పెట్టి, సచివాలయానికి వెళ్ళకుండా పరిపాలనాను గాలికి వదిలేయడం, సమస్యలు వున్న ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా అన్యాయం, బాధాకరం అని పేరాల అన్నారు.