పాత చేర్యాల ఉనికిని కాపాడుకునే ఉద్దేశ్యంతో చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష చేస్తున్నారని చేర్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మంచాల చిరంజీవులు తెలిపారు. 25వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాగే ఈ దీక్షా కార్యక్రమం చేర్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద జరుగుతుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన చేర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. చేర్యాల అసెంబ్లీ నియోజకవర్గంగా పాత తాలూకా గా పుణ్య క్షేత్రమైన కొరమరవెల్లి మల్లన్న ఆలయం ఉన్న ఈ పవిత్ర ప్రాంతం అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ఎంపి చేస్తున్న దీక్షకు అందరూ మద్దతు పలకాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
75 సంవత్సరాలుగా పోరాట పటిమను చూపిస్తున్న చేర్యాల ప్రాంతం ఇప్పుడు టీఆర్ఎస్ చేతిలో అన్యాయానికి గురి అవుతున్నదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చేర్యాల ఉనికిని తీసేసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని ఆయన అన్నారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చేర్యాల నియోజకవర్గాన్ని జనగామలో కలిపారని, దాంతో చేర్యాల పేరే కనుమరుగైందని ఆయన అన్నారు.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జిల్లాల ఏర్పాటు సమయంలో జనగామ నియోజకవర్గాన్ని ముక్కలు చేసి చేర్యాల ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా చేర్యాల కొమరవెల్లి మద్దూరు మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపారని చిరంజీవులు అన్నారు. నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట, జనగాం మండలాలను జనగామ జిల్లాలో కలిపారని ఆయన అన్నారు. ఏ పని అయినా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుర్భర పరిస్థితుల్లో చేర్యాల డివిజన్ ప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి చేర్యాల ప్రాంత ప్రజలు చేసిన త్యాగానికి ఇదా ఫలితం అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతంలోని రైతుల కోసం నిర్మించిన తపాసుపల్లి రిజర్వాయరు నుంచి నీటిని దుకుపోతున్నారని, ఇలాంటి అంశాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చిరంజీవులు తెలిపారు. అందుకే ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్యమం చేస్తున్నారని దానికి అందరూ సహకరించాలని మంచాల చిరంజీవులు కోరారు.