TRS ప్రభుత్వం తీసుకున్న LRS ని సవాల్ చేస్తూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
LRS ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఆయన అంటున్నారు. ఎప్పుడో తీసుకున్న స్థలానికి మళ్ళీ డబ్బులు కట్టలేరని వివరిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కోమటిరెడ్డి పిటీషన్ వేశారు.
సామాన్య ప్రజలు కొనుగోలు చేసిన ప్లాట్లు వారి కష్టపడి సంపాదించినవి అని ఇప్పుడు వారిపై ఇంత భారీ జరిమానా విధిస్తున్నారని ఆయన అన్నారు.
ఎప్పుడో కొన్న ప్లాట్ కొనుగోలు ధరలో దాదాపు సగం మళ్ళీ కట్టాల్సి వస్తుందని ఆయన అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక వేల ఎకరాల భూములు వెంచర్లుగా మారాయని, సుమారు 3-5 లక్షల ప్లాట్లు అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు.
అవి అన్ని చట్టవిరుద్ధమని ఇప్పటికే ప్రకటించారని, అనుమతి లేని లే అవుట్లకి పూర్తి బాధ్యత ప్రభుత్వ అధికారులే వహించాలని ఆయన అన్నారు.
అనుమతులు లేని వెంచర్లపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని అయితే అధికారులు అప్పుడు ఊరకుండి వారు చేసిన తప్పుకు సామాన్య ప్రజలపై భారీ జరిమానా విధించడం సరైనది కాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.