తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న LRS ,BRS చెల్లిపుల నిర్ణయం పేద మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. LRS & BRS పై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
ఇప్పటికే కరోనా తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిపై మూలిగే నక్క పై తాడిపండు పడ్డట్టు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా కేసీఆర్ చేతులెత్తేశారని, గ్రామపంచాయతీ లకు నిధులు ఇవ్వటంలేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడుLRS ,BRS అంటు పేద ప్రజల రక్తం తాగాలని కేసీఆర్ చూస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర రాజధాని చుట్టు కేసీఆర్ బంధువులకు వేల కోట్లు విలువ చేసే భూమలను ధారాదత్తం చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని, వాటికి కొనసాగింపే ఈ కొత్త నిర్ణయమని కోమటిరెడ్డి అన్నారు.
పైసా పైసా కూడబెట్టుకుని కష్టపడి కొనుక్కున్న ప్లాట్ కి LRS పేరుతో దోచుకోవాలని చుస్తున్నారని, ఇది కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడే స్కీమ్ అని ఆయన అన్నారు. పేదవారికి ఎలాంటి ఫీజు కట్టుకోకుండా రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.