ఆనందయ్య మందును తన ప్రకటన తో ప్రచారం లోకి తీసుకు వచ్చిన నెల్లూరు జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు కోటయ్య మృతిచెందగా ఇదే రోజు గత కొద్దీ రోజులుగా పెండింగ్ లో ఉంచిన ఆనందయ్య ఆయుర్వేదిక మందును ప్రజలు వాడవచ్చని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించడం గమనార్హం. కరోనా సోకడంతో పది రోజుల క్రితం నెల్లూరు జీజీహెచ్లో చెరిన కోటయ్య గత నాలుగు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
కరోనా సోకిన తర్వాత కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద ఔషధాన్ని కోటయ్య తీసుకున్నారు. అనంతరం కోలుకున్నట్లు గతంలో ఆయన ప్రకటించారు. కోటయ్య ప్రకటనతో ఆనందయ్య ఆయుర్వేద ఔషధం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కోటయ్యకు ఆక్సిజన్ స్థాయులు పడిపోవడంతో ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం మృతిచెందారు.
మరో వైపు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.
అవి రావడానికి 2- 3 వారాలు సమయం పడుతుందని వివరించింది. కె అనే మందును కమిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్ఏఎస్ దీనికి నిరాకరించింది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనడానికి నిర్ధారణలు లేవని నివేదికలు తేల్చాయి. ఈ మందు వాడినంత మాత్రాన మిగతా మందులు వాడకుండా ఉండొద్దని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఆనందయ్య ఇచ్చే పి,ఎల్,ఎఫ్ మందులు వాడొచ్చని స్పష్టం చేసింది.మొత్తానికి ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న ఆనందయ్య మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.