కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా అధికారులు శ్రమిస్తూ వస్తూ వచ్చారు. అయితే ఆ కథ ఇప్పుడు మారిపోయింది. తమిళనాడు కోయంబేడు మార్కెట్ వెళ్లిన వ్యక్తులకు కరోనా సోకిందనే వార్తలు వెలువడ్డాయి.
మన ఏరియాలో ఎవరూ లేరులే అనుకునే సమయంలో సంబేపల్లి మండలం ప్రకాష్ నగర్ కాలనీ కి చెందిన ఒక లారీ డ్రైవర్ కోయంబేడు వెళ్లి వచ్చాడని తేలింది. అతడిని మూడు రోజుల కిందట గుర్తించి కరోనా పరీక్షలు జరిపించారు. గురువారం రాత్రి అతనికి పాజిటివ్ ఖరారైంది. దాంతో స్పెషల్ డి.ఎస్.పి ప్రసాదరావు, ఎస్సై రాజా రమేష్ ప్రకాష్ నగర్ కు వెళ్లి అతను ఎవరిని ఎవరిని కలిశాడు? వారి వివరాలు అన్ని సేకరించారు.
పారిశుద్ధ్య చర్యలపై పటిష్ట ఏర్పాట్లు
శుక్రవారం జిల్లా ఎస్పీ అన్బురాజన్, ఆర్ డి ఓ మలాలా, గాలేరు-నగరి సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుజన, రాయచోటి రూరల్ సిఐ లింగప్ప, ప్రకాష్ నగర్ కాలనీ ను సందర్శించి తీసుకోవాల్సిన పారిశుద్ధ్య చర్యలపై ఎంపీడీవో నరసింహులు తాసిల్దార్ నరసింహులు వైద్యాధికారులు సూర్యనారాయణ రెడ్డి తో మాట్లాడారు.
గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చర్యలు చేపట్టారు. ఎస్ఐ రాజా రమేష్, ఏఎస్ఐ రాముడు సుమారు 170 కుటుంబాల కలిగిన ఆ ఊరిలో ఇతరులకు వ్యాధి సోకకుండా వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అందరి కొంప ముంచిన డిన్నర్ పార్టీ
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి గ్రామంలో ఒక డిన్నర్ లో అందరిని కలిసినట్లు గుర్తించారు. దీంతో అతను కలిసిన ప్రతి ఒక్కరిని కరోనా అనుమానితులుగా గుర్తిస్తూ 33 మందిని బస్సుల ద్వారా తరలించారు. ఇంకా మిగిలిన వారికి శనివారం వైద్య సిబ్బందితో గ్రామంలోని టెస్ట్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
ప్రకాష్ నగర్ కాలనీ నుండి ఆఫ్ కిలోమీటర్ రెడ్ జోన్ గా గుర్తించారు దీంతో పాటు మూడు కిలోమీటర్ల పరిధిలో నిబంధనలు కఠిన తరంగా నిర్వర్తించి చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు.
రాయచోటి నియోజకవర్గం లో మొదటిసారి కరోనా సోకడంతో చుట్టుపక్కల మండలాలతో పాటు అన్ని గ్రామాలలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కనిపించని మహమ్మారి ఎక్కడ ప్రాణాలు తీసుకుంటుందని భయాందోళనకు గురవుతున్నారు.