తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం వింటే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏ ఆంధ్రా సెటిలరూ బిజెపి కి ఓటు వేయరు. కచ్చితంగా ఓటు వేయరు.
కేటీఆర్ చెప్పిన విషయం ఏమిటంటే: రాజధానిగా అమరావతిని ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో బాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచారు. కేసీఆర్ ఆ కార్యక్రమానికి వెళ్లారు.
అమరావతి శంకుస్థాపనకు అక్కడకు వెళ్లిన తర్వాత ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు తదితరులు మాట్లాడుతూ ఉండగా కేసీఆర్ అక్కడే ఉన్న ప్రధాని మోడీ కార్యాలయానికి చెందిన అధికారిని పిలిచారట. ప్రధాని మోడీ అమరావతికి ఏం ఇవ్వబోతున్నారు? ఏం ప్రకటన చేయబోతున్నారు? అని.
లోటాడు నీళ్లు…. తట్టెడు మట్టి…
అమరావతికి ఏమీ ఇవ్వడం లేదు. కేవలం లోటాడు నీళ్లు, తట్ట మట్టి తెచ్చాం అని చెప్పారట. అదేంటి ఎవరి ఇంటికి అయినా వెళ్లినప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలి కదా ఉత్త చేతులతో రావడం ఏమిటి అని కేసీఆర్ ఆశ్చర్యపోయారట. నిజానికి అమరావతి వెళ్లే ముందు రోజు కేసీఆర్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేశారట.
అమరావతి శంకుస్థాపనకు వెళుతున్నాను. పక్క రాష్ట్రంతో సఖ్యతగా ఉండాలి, పంచాయితీలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అందుకు అమరావతి నగర నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు ప్రకటిద్దామనుకుంటున్నాను అని చెప్పారట. అందుకు తెలంగాణ మంత్రి వర్గం ఆమోదించిందట.
అయితే అక్కడ ప్రధాని మట్టి నీళ్లు ఇవ్వడంతో వంద కోట్ల రూపాయలు ప్రకటించకుండా కేసీఆర్ వెనక్కి వచ్చేశారట. బిజెపి ఎన్నో మాటలు చెబుతుంటుందని, అయితే ఏ పనీ చేయదని ఉదాహరణ చెప్పడానికి మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ మాటలు సెటిలర్ల పై సమ్మోహన శక్తిగా పని చేస్తున్నాయట.