ములుగు గట్టమ్మ జాకారం మూల మలుపు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించడం పట్ల ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ములుగు గట్టమ్మ జాకారం మూల మలుపు దగ్గర ఎదురుగా వస్తున్న బస్సు వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కారులో ప్రయాణిస్తున్న కంభంపాటి శ్రీను, రమేష్, జ్యోతి, కళ్యాణ్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుసుమ జగదీష్ వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా వారికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. గాయపడిన మరో మహిళ సుజాతను వరంగల్ కేంద్ర హాస్పిటల్ కి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ములుగు ఎసై ఓంకార్ తెలిపారు.
next post