ఆంధ్రలో హైదరాబాద్ రాష్ర్ట విలీనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన మహానీయులు, తెలంగాణ స్వయంప్రతిపత్తికి ఆ రోజుల్లోనే పట్టుబట్టిన నాయకుడు, తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం కొండా వెంకట రంగారెడ్డి అని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి కొనియాడారు. కొండా వెంకట రంగారెడ్డి 130వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
అనంతరం కప్పాటి మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేవీ రంగారెడ్డి 1890 డిసెంబర్ 12న మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో జన్మించారని, ఉర్దూ భాషలో ప్రావీణ్యం సంపాదించి వకీలుగా పనిచేసి ఎందరికో సేవలందించారని పేర్కొన్నారు.
దున్నేవాడికే భూమి నినాదంతో ప్రజల మనసుల్లో స్థానం
రాజకీయాలలో విప్లవాత్మక మార్పుల కోసం ఆయన తపన పడేవారని, రెవెన్యూ మంత్రిగా ఎన్నో భూ సంస్కరణల్లో మార్పులను తీసుకువచ్చారన్నారు. కౌలుదారుల హక్కుల చట్టాన్ని రూపొందించి, భూమి కోసం జరిగిన పోరాటాల్లో ‘దున్నేవాడికే భూమి’ అనే గొప్ప నినాదాన్ని నిజం చేసిన సంఘ సంస్కర్త కెవీ రంగారెడ్డి అని కొనియాడారు. అంతేగాక సమాజంలో అట్టడుగువర్గాల కోసం అహర్నిశలు శ్రమించి నమ్మిన సిద్ధాంతాలతో ఎల్లప్పుడూ ప్రజా సేవకే అంకితమయ్యారన్నారు.
బాలికల విద్య, రైతుల మేలుతో ‘సహకార రంగారెడ్డి’గా
బాలికలకు విద్య అందుబాటులోకి తీసుకువస్తే సమాజంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది అని బలంగా నమ్మి, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను, మహిళా కళాశాలను స్థాపించి. పల్లెటూర్లలో నుండి హైదరాబాద్ కు వచ్చిన విద్యార్థినుల కోసం వసతి గృహాన్నిఏర్పాటు చేశారని కప్పాటి వివరించారు. ఇక రైతుల కోసం సహకార సంఘాల ఏర్పాటుతో ‘సహకార రంగారెడ్డి’గా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆయన్ను పిలుచుకునేవారని జ్ఞాపకం చేశారు.
గులామీ జిందగీపై పోరాడిన ధీశాలి
హైదరాబాద్ రాష్ట్రాన్నిఆంధ్ర రాష్ట్రంతో విలీనాన్నినిర్ద్వంద్వంగా ఖండించింది ఎవరైనా ఉన్నారంటే ఆయనే కెవీ రంగారెడ్డి అని, తొలినాళ్లలోనే తెలంగాణ రాష్ట్ర ఆశయాలను భుజానికెత్తుకున్న ఉద్యమకారుడు అని స్పష్టం చేశారు. గులామీకి జిందగీ సే మౌత్ బెహతర్ హై అని నినదించిన ఏకైక ధీశాలి కొండా వెంకట రంగారెడ్డి అని ఆయన నినాదమే తెలంగాణ ఆత్మగౌరవ నినాదమైందని పేర్కొన్నారు.
రాజకీయాలకు అసలైన నిర్వచనం ఇచ్చి, ప్రజల కోసం చట్టసభల్లో ఉండి ప్రజల అభివృద్ధి రంగాల్లో చట్టాలను రూపొందించిన రాజనీతిజ్ఞుడు. కొండా వెంకట రంగారెడ్డి అని ఈయన పేరుతోనే రంగారెడ్డికి ఆ పేరు సార్థకం కావడం సంతోషకరమని కప్పాటి పాండురంగా రెడ్డి స్పష్టం చేశారు.