ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం సెలవు పొడిగించారు. రెండు రోజుల కిందట ఆయన ముందుగా అనుకున్న సెలవు నెల రోజులు పూర్తి కాగా విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఆయన మరో నెల రోజుల పాటు సెలవు పొడిగించారు.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకస్మిక నిర్ణయం తీసుకుని ఎల్ వి సుబ్రహ్మణ్యం ను అత్యంత అవమానకర పరిస్థితుల్లో బదిలీ చేసిన విషయం తెలిసిందే. బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ కు ఆయనను బదిలీ చేశారు. అక్కడ కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు.
అత్యంత సీనియర్ అయిన ఐ ఏ ఎస్ అధికారిని అలాంటి చోటుకు బదిలీ చేయడం పై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. అయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అప్పటి నుంచి ఎల్ వి సుబ్రహ్మణ్యం సెలవులో వెళ్లిపోయారు. గత నెల రోజులుగా ఆయన ఎంతో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. కార్తీక మాసం అయినందున పూర్తి ఆధ్యాత్మిక ఆలోచనలతో ఆయన ఉండిపోయారు.
ఇప్పుడు ఆయన తన అనుభవాలను ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. తాను ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి పరిస్థితుల నుంచి తనను చంద్రబాబునాయుడు అత్యంత అవమానకర రీతిలో అత్యంత చిన్న పోస్టుకు బదిలీ చేయడం, ఆ తర్వాత తనను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడం తదితర విషయాలను ఆయన కూలంకషంగా తన పుస్తకంలో వివరించనున్నారని తెలిసింది.
కొత్త గా అధికారంలోకి వచ్చినపుడు జగన్ తనతో వ్యవహరించిన తీరు, ఆ తర్వాత తనను ఏ విధంగా అవమానించింది కూడా తన పుస్తకంలో వివరించనున్నారని తెలిసింది. అత్యంత ఉన్నత పదవులు, అతి కనిష్ట పదవులను కూడా అంతే నిష్టతో పని చేసిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ఈ పుస్తకం తీసుకువస్తే కొత్తగా ఐఏఎస్ గా వచ్చేవారు ఏ విధంగా ఉండాలి అనే విషయంలో ఒక గైడ్ గా ఉపయోగపడుతుంది.
రాజకీయ నాయకులు తమ స్వార్ధం కోసం ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా తన పుస్తకంలో ప్రస్తావించే అవకాశం ఉన్నందున అది కూడా ఐఏఎస్ లకు క పాఠం లాగా ఉంటుంది.