భర్త, అత్తల అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులు, చిత్రహింసలకు గురిచేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత (25) తన 9 నెలల పసి బిడ్డ తో కలిసి ఎల్ఎండి రిజర్వాయర్ నీటి లో ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే సమయానికి ఆ సంఘటన చూసిన లేక్ అవుట్ పోస్ట్ పోలీసులు అడ్డుకొని రక్షించారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జీవనోపాధి కోసం కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో నివాసం ఉంటున్న వివాహిత మారుపాక స్వప్న (25) ను భర్త రాజు అదనపు కట్నం కోసం తరచూ మానసికంగా వేధిస్తూ, శారీరకంగా హింసిస్తున్నాడు. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆమె భర్త ఆదివారం ఉదయం కూడా ఆమెను శారీరకంగా హింసించాడు.
దీంతో ఆమె తన 9నెలల పసిబిడ్డతో సహా ఎల్ యండి రిజర్వాయర్ సమీపంలోకి వచ్చి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా పోలీస్ కానిస్టేబుల్ మహేశ్వర్, హోం గార్డ్ అన్వర్ అడ్డుకుని వివరాలు ఆరా తీశారు. వెంటనే ఎస్ఐ శ్రీనాథ్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కౌన్సెలింగ్ నిర్వహించారు.
త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన వివాహిత(25),ఆమె 9 నెలల పసి బిడ్డను అప్పగించారు. ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన వివాహిత, తొమ్మిది నెలల పసిబిడ్డను రక్షించిన కానిస్టేబుల్ మహేశ్వర్, హోంగార్డు అన్వర్, ఎస్ఐ శ్రీనాథ్ లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అభినందిస్తూ రివార్డులను ప్రకటించారు.