మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఒక రకంగా సంచలనం సృష్టించాడు. దాంతో ఈ ఫొటోలపై ప్రపంచ వ్యాప్తంగా మీమ్ లు, ట్రోలింగ్ లు చేశారు. ఇలా తనను ట్రోల్ చేయడంపై లలిత్ మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
‘ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగా ఉంటే చూడలేని మధ్య యుగంలో మనం ఇంకా జీవిస్తున్నామా’ అంటూ ఆయన తన బాధను వ్యక్తం చేశాడు. ఇంత బాధ వ్యక్తం చేసిన వాడు ఊరు కూకుండా మరో విషయం కూడా చెప్పాడు. ‘మా ఇద్దరి మధ్య కెమిస్ట్రి కుదిరితే మా ఇద్దరి మధ్య సంబంధం కొత్త మలుపు తిరగవచ్చు’ అని కూడా చెప్పాడు. నన్ను ట్రోల్ చేయడానికి మీడియా ఎందుకు ఉత్సాహంగా ఉంది?
నేను ఇన్స్టాగ్రామ్లో రెండు చిత్రాలను ఎందుకు షేర్ చేశానో తెలుసుకోరా? అంటూ ఆయన మీడియాపై ధ్వజమెత్తారు. ‘మన దేశంలో జర్నలిస్టులకు జవాబుదారీతనం లేదని నేను భావిస్తున్నాను. దీనికి సంబంధించి వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
ప్రతి జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిగా ఉండటానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. మీరే జీవించండి అయితే ఇతరులను కూడా బ్రతకనివ్వండి అనేది నా సలహా. సరైన వార్తలు రాయండి. డొనాల్డ్ ట్రంప్ స్టైల్ లో ఫేక్ న్యూస్ కాదు. నా గురించి మీకు తెలియకపోతే నా జీవితం గురించి చెబుతాను అంటూ లలిత్ మోదీ వ్యాఖ్యానించాడు. మినల్ మోదీతో తనకు వివాహమైనప్పటికీ, సుస్మితాసేన్ 12 సంవత్సరాలు తనకు మంచి స్నేహితురాలని ఆయన చెప్పాడు. మీడియా నన్ను ‘పారిపోయిన’ అంటున్నది.
ఇప్పటి వరకు ఏ కోర్టు నన్ను దోషిగా నిర్ధారించిందో చెప్పండి అంటూ లలిత్ మోదీ ప్రశ్నించాడు. ‘మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలిచినప్పుడు నేను ఏమి పట్టించుకోవడం లేదు ఎందుకంటే నేను ‘డైమండ్ స్పూన్’తో పుట్టాను. నేనెప్పుడూ లంచం తీసుకోలేదు, నాకు దాని అవసరం కూడా లేదు. రాయ్ బహదూర్ గుజర్మల్ మోదీకి నేను పెద్ద మనవడినని బహుశా మీరు మరిచిపోయారేమో అని లలిత్ మోదీ అన్నాడు.
నేను దేశంలోకి డబ్బు తెచ్చాను. ఎప్పుడూ తీసుకోలేదు. ముఖ్యంగా ప్రజల సొమ్మును ఎప్పుడూ తీసుకోలేదు. ఎప్పుడూ ప్రభుత్వం పక్షం వహించలేదు. ఇప్పుడు మిమ్మల్ని నిద్ర లేపాల్సిన సమయం ఆసన్నమైందని లలిత్ మోదీ మీడియా గురించి అన్నాడు. నేను బీసీసీఐలో చేరినప్పుడు బోర్డు బ్యాంకు ఖాతాలో రూ.40 కోట్లు మాత్రమే ఉన్నాయి. నేను బయటకు వచ్చినప్పుడు BCCI బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మీరు ఊహించగలరా?
ఆ సమయంలో బీసీసీఐ ఖాతాలో రూ.47680 కోట్లు అంటే దాదాపు 17 బిలియన్ డాలర్లు. ఎవరైనా జోకర్ సహాయం చేశాడా? లేదు… ఎలా ప్రారంభించాలో కూడా వారికి తెలియదు. నకిలీ మీడియాకు సిగ్గుందా అని లలిత్ మోడీ ప్రశ్నించాడు. మన అందమైన దేశంలో నాలాంటి వ్యక్తి ఉన్నాడా మీరు చెప్పండి. భారతదేశంలో వ్యాపారం చేయడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.
మనం 15 నగరాలను ఎంచుకుంటే, ఈ రకమైన సమస్య 12 నగరాల్లో వస్తుంది. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలో ఐపీఎల్ టీ20 సందర్భంగా కూడా ఇదే చెప్పాను. ఆ సమయంలో అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు ఎవరు నవ్వుతున్నారు? దేశానికి నేను చేసిందంతా ఒంటరిగానే చేశానని అందరికీ తెలుసు. బీసీసీఐ లో కూడా ఎవరూ ఏమీ చేయలేదు. ప్రతి ఒక్కరూ రోజుకు 500 డాలర్లు చెల్లించి అక్కడికి వచ్చేవారు.
లలిత్ మోదీ ఐపీఎల్ విజయానికి తానే కారణమన్నారు. దేశాన్ని మొత్తం కలిపే ఐపీఎల్లో ఇదంతా ఎవరు చేశారో అందరికీ తెలుసు. ఇది నేను సృష్టించిన గేమ్, అందరూ అప్పటిలో ఆనందించారు. అయితే ఇప్పుడు ప్రతి జోకర్ మాట్లాడుతున్నాడు అని లలిత్ మోదీ వ్యాఖ్యానించాడు.