దేశంలో కరోనా విలయతాండవం మరింత తీవ్రంగా ఉండబోతున్నదా? ప్రతిష్టాత్మక బ్రిటిష్ మెడికల్ జర్నల్ లాన్ సెట్ అంచనా ప్రకారం ఆగస్టు ఒకటో తారీకు కల్లా దేశంలో దాదాపుగా పది లక్షల మంది కరోనాతో మరణిస్తారు.
ఇప్పటి వరకూ దేశంలో 2,34,083 మంది కరోనాతో మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసే ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించిందని లాన్ సెట్ తన సంపాదకీయంలో పేర్కొన్నది.
ఇదే జరిగితే భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాల్సి ఉంటుందని లాన్ సెట్ పేర్కొన్నది.
కరోనా తొలి దశ విషయంలో ఈ ఏడాది ఏప్రిల్ వరకూ సమర్ధంగా పని చేసిన భారత వ్యవస్థలు ఆ తర్వాత ఒక్క సారి కూడా సమావేశం కాలేదని లాన్ సెట్ పేర్కొన్నది. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందని కూడా లాన్ సెట్ తెలిపింది.