బలం ఉన్నవాడిదే రాజ్యం అనే సూత్రం ఆంధ్రప్రదేశ్ లో బాగా నడుస్తున్నట్లుగా ఉంది. తన స్థలాన్ని ఒక వీధి రౌడీ ఆక్రమిస్తున్నాడని, తనకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు చెప్పినా ఖాతరు చేయడం లేదని ఒక మహిళ మొరపెట్టకున్నా వినేనాథుడు కనిపించడం లేదు.
కడప జిల్లా నందలూరు మండలం చెన్నయ్యగారి పల్లె లో కె.సులోచన అనే 60 ఏళ్ల మహిళకు ఇంటి స్థలం ఉంది. ఈ స్థలంపై స్థానిక వీధి రౌడీ ఒకరు కన్నేశాడు. ఆమె కుటుంబం అంతా తిరుపతిలో ఉంటుందని గమనించిన అతను ఆ స్థలం కబ్జాకు ప్రయత్నించాడు. విషయం తెలిసిన సులోచన స్థానిక అధికారులకు చెప్పింది.
అంతే కాకుండా పోలీసులకు సమాచారం కూడా ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత కూడా అతను కబ్జాప్రయత్నాలు మానుకోకపోవడంతో కోర్టుకు వెళ్లి ఆమె ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయినా సరే అతను కబ్జా ప్రయత్నాలు మానుకోవడం లేదు సరి కదా తాజాగా ప్రహరీ గోడ కట్టడం ప్రారంభించాడు.
సులోచన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు అన్నీ పోలీసులకు ఇచ్చి కబ్జా నిలుపుదల చేయాల్సిందిగా కోరారు. అయితే అతను పోలీసులను కూడా ఖాతరు చేయని పరిస్థితి ఉంది. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పేరు చెప్పి పోలీసులను కూడా అతను బెదిరిస్తున్నాడని తెలిసింది.
ఒక సందర్భంగా దేవిశెట్టి లక్ష్మీనారాయణ అనే అతనికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి స్పష్టం చేశారు. అతను చేసే పనులకు తన పేరును వాడుకుంటున్నాడని కూడా ఆయన చెప్పారు. అయినా సరే అతడిని ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.
తన స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని సులోచన పోలీసులను నేడు మళ్లీ కోరారు.