పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో జరిగిన రిజిస్ట్రేషన్ స్కామ్ పై సీబీఐ దృష్టి సారించింది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులపై కూడా సీబీఐ కన్నేసినట్లు తెలిసింది. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల మాయంపై కొన్ని నెలల కిందట విజిలెన్స్ అధికారులు వారం రోజులపాటు తనిఖీలు చేశారు. 2019లో ఒక వ్యాపార సంస్థ రూ. కోటి ఆస్తికి తమ సంస్థ ఉద్యోగులను బినామీలుగా చేసి రూ.5 కోట్లగా ఎక్కువ ఖరీదుతో దస్తావేజులు సృష్టించి బ్యాంకులను మోసం చేసిన కేసు వెలుగు చూసింది. యూనియన్ బ్యాంకు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ కేసును సీబీఐ మరింత లోతుగా విచారణ జరుపుతోంది. ఆస్తి విలువను రూ.5 కోట్లకు పెంచి రిజిస్ట్రేషన్ చేసిన విషయంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు కూడా గోప్యంగా శాఖాపరమైన విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఏలూరులో జిల్లా రిజిస్ట్రార్ లేనందున విజయవాడ రిజిస్ట్రార్ ఉషా విజయలక్ష్మి దీనిపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
previous post