నిరంతరం ప్రజా క్షేత్రం లో ఉంటూ అవిశ్రాంతంగా శ్రమించి ఎల్ బి నగర్ నియోజక వర్గం అభివృద్ధి పథం లో పరుగు పెడుతుండటం తో ఓర్వలేని కొందరు వ్యక్తిగతంగా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎల్ బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
7 సంవత్సరాల క్రితం తనపై పస లేని వార్తలు ఇలాగే ప్రసారం చేశారని ఇప్పుడు కొంతమంది దివాలాకోరు వ్యక్తులు మళ్ళీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
ఆయన ప్రకటన పూర్తి పాఠం:
నా వ్యక్తిత్వానికి భంగం కలిగించే అభాండాలను, అసత్యాలను నాకు ఆపాదించాలని కుట్రలు చేస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్ మొదలైన సామాజిక మాధ్యమాల్లో నాపై విష ప్రచారం మొదలు పెట్టారు. ఈ కుట్ర కోణానికి కొందరు కాంగ్రెస్ నాయకులకు తోడుగా టీ అర్ ఎస్ ముఖ్య నాయకుల పాత్ర కూడా ఉంది.
ఈరోజు ఒక “వార్తా ఛానెల్ ” ద్వారా మళ్లీ నాపై విషం కక్కడం మొదలుపెట్టారు. ఈ వార్తా ప్రసారం చూసిన మీకు కొన్ని విషయాలు తెలియాలి. భూమి కబ్జా చేశానని, ఒక ఏసీపి స్థాయి పోలీసు అధికారి సస్పెండ్ కావడానికి నాకు సంబంధం ఉన్నదని అబద్ధపు వార్తను ప్రసారం చేశారు.
1. భూమి కబ్జాకు గురైతే అది ఎవరిది ? ఆ భూమి ఎక్కడున్నది ? దాని సర్వే నంబర్ ఎంత ? అది ప్రభుత్వానిదా ? లేక ప్రైవేటు వ్యక్తులదా ?
2. ఆ కబ్జాకు నాకు సంబంధం ఉంటే సంబంధిత పట్టాదారు ఎవరైనా, తన భూమి కబ్జా చేసినందుకు నాపై ఎవరికైనా ఫిర్యాదు చేశారా ?
3. లేదా ప్రభుత్వ భూమి ఐతే సంబంధిత అధికారులు ఎవరైనా నాపై పోలీసులకో, ప్రభుత్వానికో కబ్జా విషయమై ఫిర్యాదు చేశారా ?
4. ఒక పోలీసు అధికారి సస్పెండ్ కావడానికి నాకేం సంబంధం ఉందో చెప్పాలి ?
5. సస్పెండ్ అయిన పోలీసు అధికారి పై ప్రభుత్వం విచారణ చేసి ఎలాంటి కారణం తో సస్పెండ్ చేసిందో స్పష్టంగా చెప్పలేదా ?
6. సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివిధ వార్తా పత్రికలు, ఛానల్ లు స్పష్టం గా కథనాలు నిజాలు ప్రసారం చేయలేదా ?
7. వాటికి భిన్నంగా నాపై విష ప్రచారం చేయడం కుట్ర కాదా ?
నిష్కళంక ప్రజా, రాజకీయ జీవితం లో నేను కొన్ని నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాను. ప్రజా ప్రతినిధి గా నాకున్న పరిధి లో నేను పూర్తి పారదర్శకంగా, ఆదర్శంగా, మచ్చలేని వ్యక్తిత్వంతో ఉంటున్నాను.
కరోనా వైరస్ కారణంగా నేను గృహ నిర్భంధం (హోమ్ ఐసోలేషన్) లో ఉన్నాను. రానున్న రెండు మూడు రోజుల్లో ఇది పూర్తవుతుంది. ఈ కుట్ర కోణంలో నిజానిజాలు విచారణలో త్వరలోనే తెలుస్తాయని విశ్వసిస్తున్నాను.
“నిజం నిలకడ మీద తెలుస్తుంది”. నాపై వస్తున్న అసత్య కథనాల నేపథ్యంలో ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. అన్ని కుట్రలకు కాలమే తగిన సమాధానం చెబుతుంది. మీరంతా సంయమనం పాటించాలని కోరుతూ, పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ సేవకుడు, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే, చైర్మెన్ ఎం ఆర్ డి సి ఎల్