హైదరాబాద్ శివారు ప్రాంతమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తాను చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేని కొందరు రాజకీయ నాయకులు, చెరువులను కబ్జా చేస్తున్న అక్రమ ఆక్రమణదారులు తనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.
హైదర్ నగర్ కిందికుంట చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనుల విషయంలో నాలుగు రోజుల క్రితం రెవెన్యూ సిబ్బందికి స్థానిక ప్రజలకు మధ్య జరిగిన వాదోపవాదాల విషయంలో సోషల్ మీడియా లో ప్రచారమవుతున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు.
చెరువును అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో కొందరు కబ్జా రాయుళ్లకు ఆటంకం ఏర్పడడంతో కొన్ని రాజకీయ శక్తులతో చేతులు కలిపి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తున్నారని గాంధీ అన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు.
మహిళా ఉద్యోగిని అగౌరవ పరచలేదు
కుల మతాలకు అతీతంగా, మహిళల పట్ల గౌరవ భావంతో పనిచేస్తున్నానని ఆయన అన్నారు. మహిళా ఉద్యోగి పట్ల తాను ఎంతో గౌరవప్రదంగా మాట్లాడాను తప్ప ఏ విధమైన దూషణ కానీ, అమర్యాదగా మాట్లాడడం కానీ జరుగలేదని ఆయన అన్నారు.
కానీ కొందరు సంబంధం లేని వ్యక్తులు అసభ్యంగా మాట్లాడారని కంప్లైంట్ ఇవ్వడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కరెక్టు కాదని ఆయన అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అనేక చెరువులు కబ్జాకు గురై శిధిలావస్థలో ఉండి , డ్రైనేజి వ్యవస్థ విచ్చిన్నకరంగా మారి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో ప్రజల అభ్యర్ధనల మేరకు సొంత నిధులు వెచ్చించి పని చేస్తున్నానని ఆయన అన్నారు.
దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, మంత్రి కేటీఆర్ సహకారంతో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. చెరువు పూడిక తీత , డ్రైనేజి వెసులు బాటు , పెద్దలకు , మహిళలకు వాకింగ్ ట్రాక్ , పిల్లలకు పార్క్ గ్రీనరీని అభివృద్ధి పరిచేందుకు కంకణం కట్టుకొని పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు.
ఈ తరుణంలో కొన్ని రాజకీయ శక్తులను , కబ్జా రాయుళ్లను అడ్డుకొని అడ్డుకట్ట వేయడం భరించలేనిదిగా మారిందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. అసత్య ప్రచారం చేసే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని, అదే విధంగా ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగానూ, రాజకీయరంగాను, అప్రదిష్ట పలు చేయడానికి ప్రయత్నించినా ఛానల్ వారిపై చట్ట పరంగా పోరాడతామని ఆయన తెలిపారు.