రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రభుత్వం ఏవిధంగా భంగపడిందే అదే విధంగా రాజధాని విషయంలో కూడా భంగపడుతుందని అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కన్వీనర్ ఏ. శివారెడ్డి అన్నారు. మూడు రాజధానుల బిల్లును గవర్నర్ అమెదించిన నేపధ్యంలో విజయవాడ, అమరావతి పరిరక్షణ సమితి జెఏసీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శివారెడ్డి, తిరుపతిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గాని, హైకోర్టు గాని ఏదో ఒకరోజు బ్లాక్ డే వస్తుందన్నారు. దేశంలో కూడా ఇదే విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తే దేశం ఎన్ని ముక్కలు అవుతుందో అనే విచక్షణ జ్ఞానం లేకుండా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
నేటితో రాష్ట్ర ప్రజల బతుకు సర్వనాశనం
రాష్ట్ర ప్రజల బ్రతుకు ఈ రోజుతో సర్వనాశనం అయిందని, ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి, గవర్నర్ కు కనువిప్పు కలగలేదని ఈ నిర్ణయంతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందన్నారు. అమరావతిలో జరిగే అన్యాయం భవిష్యత్ లో రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులకు జరుగుతాయి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
భవిష్యత్ లో రైతులు ప్రభుత్వాలకు ఒక సెంటు భూమి ఇస్తారా అని ప్రశ్నించారు.. రైతులు భూములు ఇచ్చిన పాపానికి వారిని సర్వనాశనం చేశారన్నారు. రాబోయే కాలంలో రైతులు ఉసురు అంతకంతకు అనుభవిస్తారని, మూడు రాజధానుల బిల్లు, సిఆర్డిఎ బిల్లుల ఆమోదం నిర్ణయం న్యాయస్థానంలో నిలబడదన్నారు.
గవర్నర్ నిర్ణయంపై కార్యాచరణ
ప్రధానమంత్రి అమరావతిలో గొప్పరాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని, విభజించుకోండి పాలించుకోండి.. మీరు తీసుకునే తప్పుడు నిర్ణయముపై ఆలోచన చేసి ఉపసంహరణ చేసుకోవాలని సూచించారు. అన్ని రాజకీయపార్టీలు, రైతు, సంఘాలు, మేధావులతో ఐక్యకార్యాచరణగా ఏర్పాటు చేసి గవర్నర్ తీసుకొనే నిర్ణయంపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని అమరావతి విజయవంతం అయ్యేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
పవన్ కల్యాణ్ మాతో కలిసిరావాలి
బిల్లు ఆమోదానికి నిరసగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతులు, కుల మతాలకు అతీతంగా రోడ్డుపైకి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ ఈ దొంగ ప్రభుత్వం తీసుకొచ్చే తప్పుడు బిల్లులను గవర్నర్ ఆమోదించడం సిగ్గు చేటు అన్నారు.
సోము వీర్రాజు అమరావతిలో రాజధాని ఉండటానికి సహకరిస్తామని చెప్పారన్నారు. పవన్ కళ్యాణ్ మాతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. న్యాయస్థానంలో పోరాటం చేస్తామని గవర్నర్ తీసుకునే నిర్ణయం తప్పుడు నిర్ణయం అన్నారు.
అమరావతిని కాపాడుకోవడానికి న్యాయపోరాటం
ఈ రోజు దుర్దినం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో ప్రజలు, రాష్ట్రం అన్యాయం కాబోతుందన్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేల భవిష్యత్ అగమ్య గోచరంగా కాబోతోందని రాజధాని రైతులు ధైర్యంగా ఉండాలని అన్నారు. కో కన్వీర్ ఆర్.వి స్వామి మాట్లాడుతూ ఈ రోజు బ్లాక్ డే సోము వీర్రాజును మేము కలిస్తే అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని హామీ ఇచ్చారని అన్నారు. కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తామని 100% అమరావతిలో రాజధాని పున:ప్రకటన చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు.
గుంటూరు జెఏసీ కన్వీనర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కేంద్రసహకారంతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుందని, రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు భూస్థాపితం కాబోతున్నాయన్నారు. బీజేపీ కుటిలనీతిని ప్రజలు గమనిస్తున్నారని, మీ పతనం ఆంధ్రప్రదేశ్ నుండి ప్రారంభమై దేశంలో కొనసాగుతుందని తెలిపారు.
త్వరలో అఖిలపక్షం సమావేశం పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. అనంతరం గవర్నర్ నిర్ణయంపై నల్ల కండువాలు ధరించి కొవ్వెత్తులతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జెఏసీ నాయకులు గద్దె రాజలింగం తదితరులు పాల్గొన్నారు.