కాబోయే రాజధాని విశాఖపట్నంలోని ఐదు గ్రామాలను స్మశానాలుగా మార్చిన ఎల్ జి పాలిమర్స్ కు పర్యావరణ అనుమతి లేదని అధికారికి రికార్డులు చెబుతున్నాయి. కేవలం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన అనుమతులతోనే ఫ్యాక్టరీని నడుపుతున్నారు.
విశాఖ పట్నం జిల్లా వెంకటాపురం గ్రామంలోని సర్వే నెం 1 నుంచి 46 పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలోని సర్వే నెం 111 నుంచి 118 వరకూ ఈ కంపెనీ తన కార్యకలాపాలు సాగిస్తున్నది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి అవసరం అయినా కూడా దాన్ని కాదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఇవ్వడం వెనుకే మతలబు ఉంది.
ఈ మతలబే 12 మంది మరణానికి కారణం అయింది. అంతే కాకుండా వేలాది మంది నిరాశ్రయులవ్వడానికి కారణమైంది. కంపెనీ నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు సత్యం న్యూస్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల కిందటి పరిశ్రమ వార్షిక నిర్వహణ ఆడిట్ రిపోర్టులో లోహంతో తయారైన వాల్వుల వద్ద తుప్పపట్టినట్లు వాటిని సరి చేసుకోవాలని సూచించినా పరిశ్రమ పట్టించుకోలేదు.
సాలిస్టెరీన్ ను 1989లోనే ప్రమాదకర వాయువుల జాబితాలో చేర్చారు. జనావాసాల మధ్య వీటిని ఉపయోగించే కంపెనీలను ఏర్పాటు చేయడానికి కూడా వీల్లేదు. అయినా ఈ మృత్యు కుహరం ఇక్కడ ఏర్పాటు అయి ప్రాణాలు హరించింది. దాదాపు రెండు వేల మెట్రిక్ టన్నుల స్టైరెన్ ను ఈ కంపెనీ నిలువ చేసింది.
అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రత పెరిగిపోవడంతో స్టైరిన్ లీక్ అయి ప్రమాదం చెలరేగింది. ఆ వాయువు విస్తరించిన ప్రాంతంలో 110 డిగ్రీల వేడి ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం తప్ప వేరొకటి కాదు.