శాంతించిందనుకున్న కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఓ వైపు ఒమిక్రాన్ ఆందోళన కొనసాగుతుండగానే మరోవైపు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక క్రీడారంగంలోనూ ఈ వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇప్పటికే వివిధ క్రీడలకు చెందిన పలువురు ఆటగాళ్లకు ఈ వైరస్ సోకగా తాజాగా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కొవిడ్ బాధితుల జాబితాలో చేరిపోయాడు. మెస్సీతో సహా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ పారిస్ సెయింట్ జెర్మైన్ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఈ వైరస్ బారిన పడినట్లు పీఎస్జీ ప్రకటించింది.
కాగా ఫ్రెంచ్ కప్లో భాగంగా మెస్సీ జట్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే అంతకుముందే మెస్సీ, డిఫెండర్ జువాన్ బెర్నాట్, గోల్కీపర్ సెర్జియో రికో, మిడ్ ఫీల్డర్ నాథన్ బితుమజాలా కొవిడ్ బారిన పడినట్లు పీఎస్జీ ధ్రువీకరించింది. వీరితో పాటు సిబ్బందిలో మరొకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, ప్రస్తుతం వీరంతా ఐసోలేషన్లో ఉన్నారని పీఎస్జీ పేర్కొంది.
ఇదిలా ఉంటే మెస్సీ.. కోవిడ్పై సోషల్మీడియాలో పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే మహమ్మారి బారిన పడడం గమనార్హం. మరోవైపు ఫ్రెంచ్కప్లో ఇప్పటివరకు 11 లీగ్ మ్యాచ్లు ఆడిన మెస్సీ కేవలం ఒక గోల్ మాత్రమే చేశాడు.