మునిసిపల్ ఎన్నికల్లో నాయకులు జనంతో తాగించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. తాగాలె, డబ్బు తీసుకోవాలే మాకే గుద్దాలె అంటూ నిన్నటితో ప్రచారం ముగిసింది. రాత్రికి రాత్రే కోట్లాది రూపాయలు పంచిపెట్టినట్లు కూడా సమాచారం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చుచేయడం ఇప్పటి వరకూ లేదు. కాంగ్రెస్, బిజెపి క్యాండిడేట్లు బలంగా లేకపోయినా టీఆర్ఎస్ తన అధికార దర్పాన్ని, తన ప్రాబల్యాన్ని దారుణంగా ప్రదర్శించింది.
రాష్ట్ర వ్యాప్తంగా జనవరి1-20 వరకు సుమారు రూ.1,500 కోట్లు విలువైన 21.90 లక్షల కేసుల లిక్కర్, 20.80 లక్షల కేసుల బీరు అమ్మకం జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే సుమారు రూ.350 కోట్ల అధికంగా విక్రయం జరిగినట్లు. అంటే ఇది ఎన్నికల ప్రభావమే కదా?
హైదరాబాద్లో రూ.147 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా వరంగల్ అర్బన్ జిల్లాలో రూ.140 కోట్ల మేరకు మద్యం అమ్ముడు పోయింది. రంగారెడ్డిలో రూ.323 కోట్లు, నల్గొండలో రూ.170 కోట్లు, మహబూబ్నగర్ జిల్లాలో రూ.110 కోట్లు, మెదక్లో రూ.121 కోట్లు, కరీంనగర్లో రూ.130 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో రూ.82 కోట్లు చొప్పున మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.