దేశ వ్యాప్తంగా కోవిడ్ బాధితుల కోసం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా.. కేంద్ర ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఆన్లైన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా ఆక్సిజన్ కొరతతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కార మార్గాలను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు.
దీనిలో భాగంగా రోజువారి ఆక్సిజన్ ఉత్పత్తిని 5,700 మెట్రిక్ టన్నుల నుండి 10,000 మెట్రిక్ టన్నులకు పెంచడమైందని అన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో లక్ష ఆక్సిజన్ CONCENTRATOR’s ను PM CARES నిధుల ద్వారా ఏర్పాటు చేస్తున్నామని, ఆక్సిజన్ రవాణాకు ఉపయోగించే ట్యాంకర్స్ కొరత నివారణకు, వాటిని విదేశాల నుండి పెద్ద ఎత్తున దుగుమతి చేసుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతానికి 1681 ఆక్సిజన్ ట్యాంకర్స్ అందుబాటులో ఉండగా, వాటి రవాణా సామర్థ్యం మొత్తం 23,056 మెట్రిక్ టన్నులు. అలాగే మెడికల్ ఆక్సిజన్ సిలిండర్స్ (11 లక్షల 19 వేలు) అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి గత 8 నెలల క్రితం వరకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో గత 74 సంవత్సరాలలో ఏర్పాటు చేసుకున్న వెంటిలేటర్లు 20 వేలలోపే ఉండగా.. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా 51 వేల వెంటిలెటర్స్ ను పీఎం కేర్స్ నిధుల ద్వారా సమకూర్చమని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన ఆక్సిజన్ కొరత నివారణకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సహకారంతో దేశవ్యాప్తంగా 490 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు పీఎం కేర్స్ నిధులతో కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు.
తేలికపాటి యుద్ధ విమానం “తేజస్”లో అక్కడికక్కడే ఆక్సిజన్ తయారుచేసేందుకు రూపకల్పన చేసిన అధునాతన టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పేషంట్లకు ఆక్సిజన్ అందించడానికి శాశ్వత ప్రాతిపాదికన డీఆర్డీఓ టెక్నాలజీతో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ టెక్నాలజీ సాయంతో ఏర్పాటయ్యే పీఎస్ఏ ప్లాంటు ఒక్కొక్కటి నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని, ఒక్కొక్క ప్లాంటు ద్వారా 150 నుండి 190 మంది వ్యాధిగ్రస్తులకు ఆక్సిజన్ అందించవచ్చని తెలిపారు.
కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఇంకా అదనంగా 195 సిలిండర్ లలో వీటి ద్వారా ఆక్సిజన్ (Filling) నింపవచ్చని తెలిపారు. డీఆర్డీఓ రూపకల్పన చేసిన ఈ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు “ప్రెషర్ స్వింగ్ అబ్జార్షన్” (పీఎస్ఏ) టెక్నాలజీతో పనిచేస్తాయన్నారు. వాతావరణం నుండి గాలిని పీల్చుకుని జియోలైట్ పదార్థం సాయంతో 93.3% స్వచ్ఛతతో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుందని, ఆసుపత్రుల్లో అక్కడికక్కడే ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవడం ద్వారా సమయం, రవాణా ఖర్చులు, అభద్రతా భావం తగ్గుతుందన్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో, సుదూర, ఎత్తైన ప్రాంతాలలోని ఆసుపత్రులకు, ప్రజలకు, ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
పీఎం కేర్స్ నిధుల ద్వారా ఇటువంటి ప్లాంట్స్ తెలంగాణా రాష్ట్రంలోని 19 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేయడానికి ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారని, అదేవిధంగా ఏపీలోని 23 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ప్లాంట్స్ ఏర్పాటు జరుగుతున్నదని తెలిపారు.
ఇప్పటికే కొన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆక్సిజన్ వినియోగం జరుగుతోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లు అమర్చడం పూర్తయ్యిందని, అదే విధంగా ఏపీ రాష్ట్రంలో కూడా కొన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ప్లాంట్లను అమర్చడం పూర్తి అయ్యిందని తెలిపారు.
మొదటి దశలో తెలంగాణాకు 19 ఆక్సిజన్ ప్లాంట్లు, ఆంధ్ర రాష్ట్రానికి 23 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కేర్స్ ద్వారా మంజూరు చేశారని, దశల వారిగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో, ముఖ్యంగా అన్ని జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, అదే విధంగా పీఎం కేర్ ద్వారా తెలంగాణా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు 1,400 వెంటి లెటర్స్ ను సమాకూర్చమని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు.