ప్రధాని మోడీ పాలనలో బీడీ కార్మికుల బతుకులు ఆగం అయ్యాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ హాలులో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కోవిడ్ మొదటి, రెండవ దశలో షబ్బీర్ అలీ అద్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలను 40 నిమిషాల నిడివి గల చిత్ర ప్రదర్శించారు. కోవిడ్ సమయంలో వారియర్స్ గా పనిచేసిన వారికి శాలువా కప్పి అవార్డులు ప్రదానం చేశారు. చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో పడి మృతి చెందిన మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గెరిగంటి రాజయ్య కుటుంబానికి 2 లక్షల భీమా చెక్కును షబ్బీర్ అలీ అందజేశారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలో 44300 సభ్యత్వం చేయడం గొప్ప విషయమన్నారు. కార్యకర్తలు, నాయకుల సమిష్టి కృషితోనే ఇది సాధ్యం అయిందని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నారు. ఇటీవల చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందిన కార్యకర్త రాజయ్య కుటుంబానికి 2 లక్షల బీమా చెక్కు అందజేసామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు సరైన గుర్తింపు ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా బీడీ పరిశ్రమను ఎత్తేయడానికి పార్లమెంటులో ప్రధాని మోడీ బిల్లు ప్రవేశపెట్టారన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే తెలంగాణలో బీడీ పరిశ్రమపై ఆధారపడిన 6 లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని, పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టకుండా అన్ని పార్టీలతో కలిసి ఆందోళన చేపట్టామని గుర్తు చేశారు. మోడీ పాలనలో బీడీ కార్మికుల బ్రతుకులు ఆగం అవుతున్నాయని తెలిపారు.
సిగరెట్, లిక్కర్ ఉన్నప్పుడు బీడీలను మాత్రమే ఎందుకు నిలిపివేయాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 20-25 రోజుల్లోనే బిడీలపై విధించిన జిఎస్టీ ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల పిల్లల భవిష్యత్తుకు కాంగ్రెస్ భరోసాగా ఉంటుందని, ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్రలో సైతం రాహుల్ గాంధీ బీడీ కార్మికులను కలిసి మాట్లాడారని తెలిపారు. కోవిడ్ తొలి, మలిదశలో కాంగ్రెస్ కార్యకర్తల సేవలు అమోఘమని, ప్రతి కార్యకర్త సైన్యంలా పనిచేశారని కొనియాడారు. ప్రాణాలను ఫణంగా పెట్టి వలస కూలీలకు అండగా నిలబడ్డారని ప్రశంసించారు. కోవిడ్ సమయంలో సుమారుగా 320 ఆక్సిజన్ సిలిండర్లను షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. కార్యకర్తలంతా ఇదే స్ఫూర్తితో పని చేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు