రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాల వ్యవహారాలను చూసే అడిషనల్ సెక్రెటరీగా పరిచయం చేసుకుంటూ మోసం చేస్తున్న వ్యక్తిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. తాను అవినీతి నిరోధక విభాగం కరీంనగర్ జిల్లా చైర్మన్ గా కూడా పని చేస్తున్నట్లు చెప్పుకునే దులిగుంటి సాయి చందన్ (23)ను LMD పోలీసులు అరెస్టు చేశారు.
తిమ్మాపూర్ మండలం లోని మొగలిపాలెం గ్రామానికి చెందిన సాయి చందన్ కరీంనగర్ లోని విద్యానగర్ లో నివాసం ఉంటున్నాడు. ముఖ్యమంత్రి కార్యదర్శి పి రాజశేఖర్ రెడ్డి తనను రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అడిషనల్ సెక్రటరీ ఫర్ సీఎం ఫ్యామిలీ ఎఫైర్స్ గా నియమించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు.
అలాగే కరీంనగర్ జిల్లా అవినీతి నిరోధక విభాగం చైర్మన్ గా కూడా నకిలీ కార్డును తయారు చేసుకున్నాడు. ఈ నకిలీ పత్రాలతో అతడు పలువురిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం నాడు LMD పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఆర్ ప్రకాష్, శశిధర్ రెడ్డి, ఎస్ఐ కరుణాకర్, ఎల్ యండి ఎస్ఐ కృష్ణారెడ్డి, టాస్క్ ఫోర్స్, LMD పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు పాల్గొన్నారు.