ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ ప్రభావం కారణంగా పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయాలని నిర్ణయించారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీలను మళ్లీ ప్రకటిస్తారు. అయితే ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కావడం లేదు.
ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. దీనితో బాటు మరిన్ని కీలక నిర్ణయాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నది.
హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్ల, ఎస్పీలనును విధుల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశం జారీ చేసింది. అదే విధంగా మాచర్ల ఘటనలో సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశమిచ్చింది. శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను, తిరుపతి, పలమనేరు, తాడిపత్రి రాయదుర్గం సిఐలను బదిలీ చేయాలని ఆదేశాలిచ్చింది. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో అవసరమైతే ఎన్నికలను రద్దుచేసేందుకు పరిశీలన నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మహిళా అభ్యర్ధులను, బీసీ అభ్యర్ధులను ఇబ్బంది పెట్టారని దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎన్నికల సంఘం వెల్లడించింది.