దినం గడిస్తేనే తినడానికి సరుకులు తెచ్చుకునే సిద్ధిపేట ఆటో కార్మికులకు మంత్రి హరీశ్ రావు అండగా నిలిచారు. గత 15 రోజులుగా కరోనా వ్యాధి వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధింపు నేపథ్యంలో పూట గడవని ఆటోవాలాలను ఆదుకునేందుకు మంత్రి హరీశ్ ముందుకొచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎక్స్ ప్రెస్ బస్ స్టాoడ్ ఆవరణలో 700 మంది ఆటో కార్మికులకు మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా ఆహార పదార్ధాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి సీఏం కేసీఆర్ 12కిలోల బియ్యం అందిస్తున్న దరిమిలా వారికి ఉప్పు, పప్పులు, చింత పండు తదితర రూ.1250 విలువ కలిగిన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ పాల సాయిరాం, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.