కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అమలు చేస్తున్న లాక్ డౌన్ తిరుపతి నగరంలో నామ మాత్రంగానే అమలు జరుగుతున్నది. పోలీస్ యంత్రాంగం కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ నగర ప్రజలను పదేపదే హెచ్చరిస్తున్నా కొన్నిచోట్ల కొంతమంది పెడచెవిన పెట్టడం శోచనీయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కర్ఫ్యూ సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అనుమతిస్తూ అత్యవసరాల కోసం సడలించడం జరిగింది.
తిరుపతిలో కర్ఫ్యూ కారణంగా వైరస్ చైన్ లింక్ కట్ అవ్వడంతో కొంత మేరకు కేసుల సంఖ్య తగ్గింది. అయినా ఆదివారం నాడు అనేక చోట్ల ప్రజలు భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా కనిపించడం, ముఖ్యంగా ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, చికెన్ షాప్ లు, ప్రభుత్వ మద్యం షాపుల వద్ద అధిక సంఖ్యలో జనాలు చేరడంతో వారిలో ఎవరికైనా ఒకరికి వైరస్ సోకి వున్నా తద్వారా అందరికీ సోకే ప్రమాదం ఉందని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
తిరుపతి పోలీస్ యంత్రాంగం నగరపాలక సంస్థ అనేక విధాలుగా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నా కొంత మంది ప్రజలు బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా కేసుల సంఖ్య కర్ఫ్యూ సడలించిన తర్వాత ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కారణంగా అదేవిధంగా నగరంలో కొన్ని ప్రాంతాలలో భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ లో వైరస్ సోకి ఎంతో మంది స్నేహితులను ఆత్మీయులను బంధువులను పోగొట్టుకోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు.
కర్ఫ్యూ నిబంధనలను తూచ తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా మన వంతు బాధ్యతగా పోలీస్ అధికారులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.