తాను రాజకీయాల్లో ఎదగకూడదని దురుద్దేశంతో సాక్షి దినపత్రిక పదే పదే తప్పుడు వార్తలు రాస్తున్నదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సాక్షి దినపత్రిక పై తాను దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు వచ్చినందున నారా లోకేష్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు.
జగన్ మోహన్ రెడ్డి పత్రిక అయిన సాక్షి పత్రిక తనపైన, తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపైన తప్పుడు రాతలు రాస్తున్నదని ఆయన తెలిపారు. సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టామని ఆయన తెలిపారు. దీ వీక్ క్షమాపణలు కోరింది.. సాక్షి, దక్కన్ క్రానికల్ వివరణ కూడా ఇవ్వలేదు అని ఆయన తెలిపారు.
చినబాబు చిరుతిళ్లు అనే శీర్షీకతో ఆ పత్రికలో ఒక వార్త రాశారని దానికి సంబంధించి ఒక పత్రికపై 75కోట్ల, మరో పత్రికపై 25 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు లోకేష్ తెలిపారు. తనకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికి జరగకూడదనే ఉద్దేశంతో ఆ పత్రికపై పరువు నష్టం దావా వేసినట్లు లోకేష్ తెలిపారు.
అందుకే తాను న్యాయ పోరాటం చేస్తున్నానని లోకేష్ వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల సహాయంతోనే వివేకానంద రెడ్డిని హత్యచేశారని లోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రరాష్ట్రంలో ప్రజలు భయంతో బ్రతకాలనేది జగన్ లక్ష్యమని ఆయన తెలిపారు.
ఇప్పుడు సినిమా పరిశ్రమపై జగన్ దాడి మెదలు పెట్టారని ఆయన తెలిపారు. మంత్రి స్వయంగా పోలీసులపై అసభ్యంగా మాట్లాడితే నో.. పోలీస్… వైసిపి మంత్రులు బూతులు మాట్లాడితే నో పోలీస్…. అయితే ఆధారాలతో సహా ఆరోపణ చేస్తే మాత్రం కేసులు పెడతారు అని లోకేష్ అన్నారు.
శాసన సభ సాక్షిగా మా అమ్మ క్యారెక్టర్ పై మాట్లాడారు. వైయస్ విజయమ్మ, వైయస్ భారతి క్యారెక్టర్ పైన నేను కూడా మాట్లాడవచ్చు. కాని మాకు సంస్కారం అడ్డు వస్తుంది అని లోకేష్ అన్నారు.