జిల్లాలో ఎల్పీజీ సరఫరా సజావుగా చేపట్టాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఎల్పీజీ పంపిణీదారులతో ఎల్పీజీ సరఫరాపై అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్పీజీ సరఫరాలో ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బుకింగ్ సీనియారిటీ ప్రకారం వినియోగదారులకు ఎల్పీజీ రీఫిల్ ఖచ్చితంగా పంపిణీ చేయాలన్నారు. వినియోగదారుల నుండి అదనపు రవాణా చార్జీలు వసూలు చేసే పంపిణీదారులపై చర్య తీసుకోవాలన్నారు. రీఫిల్ డెలివరీ బాయ్ లు ఎల్పీజీ సిలిండర్ ను వినియోగదారుడి డోర్ స్టెప్ వద్ద డెలివరీ చేయాలని, రీఫిల్ డెలివరీ సమయంలో ఎల్పీజీ రీఫిల్ సిలిండర్ నెంబర్, వినియోగదారుల డొమెస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డ్ బుక్ లెట్ లో నమోదు చేయాలన్నారు.
రోజువారీ వ్యాపారంలో నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ ని ఉపయోగిస్తున్న అన్ని సంస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, డొమెస్టిక్ రీఫిల్ ఉపయోగిస్తే, కంట్రోల్ ఆర్డర్ ప్రకారం కేసులు బుక్ చేయాలన్నారు. అనధికార ప్రాంగణాల్లో డొమెస్టిక్ సిలిండర్లను భద్రపరచి, అక్కడి నుండి ఆపరేట్ చేస్తే, అట్టి సిలిండర్లను సీజ్ చేయడంతో పాటు ఆ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఎల్పీజీ డీలర్లు సూచనలు ఖచ్చితంగా పాటించాలని, ఎల్పీజీ సజావు సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం అధ్యక్షులు ఎం. వెంకటేశ్వర రావు, జిల్లా అధ్యక్షులు కిరణ్ బాబు, ఎల్పీజీ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.