సముద్రంలో హెలీకాప్టర్ కూలిపోవడంతో 12 గంటల పాటు ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డారు మడగాస్కర్కు చెందిన ఒక మంత్రి. ఈ ఘటనలో మడగాస్కర్ హోంమంత్రి సెర్జె గెలె తోపాటు ప్రయాణించిన మరో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. సెర్జె గెలె ప్రస్తుతం కోలుకుంటున్నారు.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఘటన పట్ల ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలీనా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారితో పాటు గెలె, మిగతా ఇద్దరు అధికారులకు కూడా నివాళులర్పించారు.
కానీ ఈ ముగ్గురు ఈదుకుంటూ విడివిడిగా సముద్ర తీర ప్రాంతం మహాంబోకు చేరుకున్నారు. హెలీకాప్టర్ కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన తర్వాత రాత్రి ఏడున్నర గంటల నుంచి ఉదయం ఏడున్నర వరకు ఈదుకుంటూ వచ్చినట్లు తెలిపారు గెలె.
తనకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారాయన. తన కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రభుత్వ అధికారులు చూసే విధంగా ఈ వీడియోను ప్రసారం చేయాలని కోరారు గెలె. తాను బతికే ఉన్నానని, క్షేమంగా ఉన్నానని చెప్పారాయన. హెలీకాప్టర్లోని ఒక సీటును నీటిపై తేలడానికి గెలె ఉపయోగించుకున్నారని పోలీసులు తెలిపారు.