సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మాదిగ జన చైతన్య నియోజకవర్గ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ జన చైతన్య సంఘం ప్రధాన కార్యదర్శి దేవపంగు బాబు మాదిగ మాట్లాడుతూ రాజ్యాధికారమే మాదిగ జన చైతన్య లక్ష్యమని, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో మాదిగలు వెనుకబడి ఉన్నారని, అన్ని రంగాలలో రాణించాలంటే రాజ్యాధికారమే మాదిగల లక్ష్యం కావాలని అన్నారు.
అగ్రవర్ణ పాలనలో నేటికీ దళితులపై దాడులు జరుగుతున్నాయని, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజా గృహం ధ్వంసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కడారి వెంకన్న మాదిగ ఆదేశానుసారం జిల్లా, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్ టి, బీసీ మైనార్టీ వర్గాలను ఒక తాటిపైకి తెచ్చి రాజ్యాధికార సాధన కోసం ఉద్యమిస్తామని అన్నారు.
అనంతరం నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిరపంగి నాని మాదిగ, ప్రధాన కార్యదర్శి సతీష్ మాదిగ, అధికార ప్రతినిధి కస్తాల ఏసుదాస్ మాదిగ, నియోజకవర్గ అధ్యక్షుడు చడపంగు జాజి మాదిగ, మంద నాగరాజు మాదిగ, అమరారపు సతీష్, చింత్రియాల సురేందర్, గుండెపంగు ధనమ్మ, యామపంగు కరుణాకర్, సూర్యపేట నియోజకవర్గ అధ్యక్షుడు గంగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.