మాగుంట సుబ్బరామిరెడ్డి 27వ వర్ధంతి ఒంగోలులోని పి.వి.ఆర్ హైస్కూల్ గ్రౌండ్ లో వేలాది మంది అభిమానుల మద్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రజాసేవా తత్పరుడని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులని కొనియాడారు. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో 14 కళాశాలలను స్థాపించి విద్యాప్రదాతగా నిలిచిందన్నారు.
నేటి రాజకీయ నేతలు మాగుంట సుబ్బరామిరెడ్డి నుండి అనేక విషయాలు నేర్చుకోవాలని, వారు రాజకీయాలను వ్యాపారాలుగా మార్చలేదని తన ప్రసంగాలలో అసభ్య పదాలు ఉండేవి కావని, విద్వేష రాజకీయాలు చేయలేదని, కులాలు,మతాల పేర్లతో రెచ్చగొట్టలేదని ప్రజలను ఐక్యంగా ఉంచడానికి కృషి చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు లోక్ సభ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి,వారి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి,ఏపీ మార్కెటింగ్, సహకార సలహాదారులు బత్తుల బ్రహ్మానందరెడ్డి లతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు,ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.